‘కానిస్టేబుల్’ని చూసి చాలా మంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు - కెమెరామెన్ షేక్ హజారతయ్య (వళి)

కెమెరామెన్‌గా 25 ఏళ్లలో 78 చిత్రాలకు పైగా చేసిన అనుభవం ఉన్న షేక్ హజారతయ్య (వళి) రీసెంట్‌గా ‘కానిస్టేబుల్’ అంటూ అందరి ముందుకు వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్‌గా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మించిన ఈ మూవీకి వళి కెమెరామెన్‌గా పని చేశారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో కెమెరామెన్ వళి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

మాది నెల్లూరు జిల్లా. మక్కెనవారిపాలెం గ్రామం. నేను ఈ ఇండస్ట్రీలోకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారి వల్లే వచ్చాను. ఆయనే నన్ను ఇలా కెమెరా డిపార్ట్మెంట్‌లో పనిలోకి పెట్టారు. అలా 25 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశాను. దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో తీసిన చిత్రాలకు అవార్డులు కూడా వచ్చాయి.

అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ ఇలా ఎన్నో సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. నేను చిన్నతనం నుంచీ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తరువాత ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్‌ను చూశాను. కష్టపడితే పైకి వస్తామని ఆయన్ను చూశాక అర్థమైంది. 

బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్‌గా వచ్చారు. ఆ మూవీనికి నేను కెమెరామెన్‌గా పని చేశాను. అప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది. మీతో కచ్చితంగా ఓ సినిమాను తీస్తాను అని అప్పుడు బలగం జగదీష్ అన్నారు.

జగదీష్ గారు ‘కానిస్టేబుల్’ కథను విన్న వెంటనే నా దగ్గరకు పంపారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథ అద్భుతంగా ఉంది అని జగదీష్ గారికి చెప్పాను. అలా ఈ మూవీ జర్నీని స్టార్ట్ చేశాం.

వరుణ్ సందేశ్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయనతో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్‌లా అనిపిస్తుంది. ఎక్కడా కూడా తన స్థాయిని ప్రదర్శించడు. సెట్‌లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఓ సారి షూటింగ్‌లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేశారు.

‘కానిస్టేబుల్’ చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా? అని పొగిడేస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ వచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ఇలా ‘కానిస్టేబుల్’కి మంచి స్పందన వస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

‘కానిస్టేబుల్’ సినిమాకు దర్శక, నిర్మాతలు చాలా కష్టపడ్డారు. నిర్మాత అయితే ఎప్పుడూ సెట్స్‌లో ఉండి అన్ని విషయాల్ని గమనిస్తుండేవారు. ప్రొడక్షన్ ఫుడ్‌ని కూడా ఆయన చెక్ చేసి, అందరికీ కడుపునిండా భోజనం పెట్టేవారు. ఇక దర్శకుడు అయితే ప్రతీ సీన్‌ను, ప్రతీ ఆర్టిస్ట్‌కు నటించి చూపించేవారు. అది చాలా మంది దగ్గర ఉండే క్వాలిటీ. రాజమౌళి, సుకుమార్ వంటి వారు అలా చేస్తుంటారు. 

ప్రస్తుతం నేను రామ్ భీమన దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాను. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నాను. ఇవి కాకుండా శివ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నాం.

No comments